హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు రోజులుగా రియల్టర్లు, భూ యజమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమ నూతన భవన నిర్మాణాలకు అనుమతులు రాక సతమతమవుతున్నారు. టీఎస్బీపాస్లో ఆన్లైన్ సర్వర్ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటుండటంతో భవన నిర్మాణాల అనుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎవరు వెబ్సైట్ను సందర్శించినా సర్వర్ అండర్ మెయింటెనెన్స్ అన్న సమాధానం వస్తున్నది. దీంతో వినియోగదారులు ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం పడిగాపులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేవలకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు సైతం రెండు రోజులుగా దరఖాస్తుదారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలులు పట్టుకుంటున్నారు. సర్వర్ బ్యాకప్లో పెట్టామని.. ఈ ప్రక్రియ ఒక్కరోజులో పూర్తవుతుందని భావించినప్పటికీ 2 రోజులు తీసుకుందని.. శనివారం నుంచి టీఎస్బీపాస్ సేవలు కొనసాగుతాయని అధికారులు చెప్పారు. 2 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతోపాటు అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో నిర్మాణ అనుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో బిల్డర్లు, యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.