హైదరాబాద్, డిసెంబర్10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారులుగా మారుతున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ప్రవేశవెట్టిన ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.2,200 కోట్ల రుణాలు అందించగా, 3.19 లక్షల మంది వ్యాపారులుగా మారారు. దీంతో పరోక్షంగా దాదాపుగా ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తున్నది. గతంలో రుణాలు ఇస్తే కుటుంబం, వ్యాపారం, విద్య, ఇతర అవసరాలకు వాడుకుంటున్నారనే అపవాదు ఉండేది. ఈ నేపథ్యంలో పక్కాగా వ్యాపారాల వైపు మళ్లించేందుకు ఎంటర్ప్రైజెస్ పథకాన్ని సెర్ప్ అమలుచేస్తున్నది. తనఖాలు లేకుండా బ్యాంకుల నుంచి రూ.2 లక్షలు అంత కంటే ఎక్కువగా రుణాలు ఇప్పిస్తున్నారు. ఈ పెట్టుబడితో గ్రామ అవసరాలు తీర్చేలా వ్యాపారాలు స్థాపిస్తున్నారు. ఎక్కువగా కిరాణా షాపులు, బట్టల దుకాణాలు, మినీ సూపర్బజార్, లేడీస్ ఎంపోరియం, టిఫిన్ సెంటర్, మినీ ప్రాసెసింగ్ యూనిట్లు, టెంట్హౌజ్, బ్యూటీ పార్లర్, పౌల్ట్రీ, చికెన్ సెంటర్లు, ఇటుకల తయారీ, పిండి గిర్నీ, ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
70 శాతం రుణ కల్పన
2022-23లో 1.34 లక్షల మందికి రుణాలు ఇప్పించాలని సెర్ప్ లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇప్పటివరకు 94,121 మందికి రూ.1,293 కోట్ల రుణాలు అందించారు. లక్ష్యంలో 70 శాతం రుణాలు ఇప్పించారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 6,549, నల్లగొండ జిల్లాలో 5,674, కామారెడ్డి జిల్లాలో 5,064, కొత్తగూడెం జిల్లాలో 4,229, సిద్దిపేట జిల్లాలో 4,263, నిజామాబాద్ జిల్లాలో 4,220 మందికి రుణాలు అందించారు.
మంచి గిరాకీ ఉన్నది
చేనేత వస్ర్తాలను 20 ఏండ్లుగా తయారుచేస్తున్నా ం. స్వయం సహాయక సంఘంలో చేరాక రుణం తీసుకొని ఉత్పత్తి పెంచాం. గతంలో లుంగీలు, టవల్స్ తయారుచేశాం. ఇప్పుడు డబుల్కాట్ బెడ్షీట్స్ తయారుచేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించినా అక్కడ షాపు పెట్టి విక్రయిస్తాం.
– దుస్స లక్ష్మి, కొడకండ్ల, జనగామ జిల్లా
రెండు షాపులు ప్రారంభించా..
మహిళా సంఘంలో పదివేల లోను తీసుకొని చీరలు తెచ్చి అమ్మాను. మంచి గిరాకీ రావడంతో డ్రెస్సులు తెచ్చి విక్రయించా. ప్రస్తుతం ఎంటర్ప్రైజెస్ స్కీం ద్వారా బ్యాంకులో రూ.ఆరు లక్షల రుణం, సంఘంలో లక్ష రూపాయలు, స్త్రీనిధి ద్వారా మరో రూ.లక్ష తీసుకొని చీరలు, లేడీస్ ఎంపోరియం, కిరాణ షాపు పెట్టా. దుకాణాలు బాగా నడుస్తున్నాయి.
–మేరుగు సరిత, కన్కల్, కామారెడ్డి జిల్లా