హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీలో ఓబీసీ క్రిమిలేయర్ (సంపన్న శ్రేణి ) పై చర్చించారు.
క్రిమి లేయర్ (సంపన్న శ్రేణి) ను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించని కారణంగా అర్హులైన ఓబీలకు విద్య, ఉపాధి రంగాల్లో అన్యాయం జరుగుతున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వకుళాభరణం దృష్టికి తీసుకొచ్చారు. యూపీఎస్సీ అవలంబిస్తున్నా విధానం విచిత్రంగా ఉందన్నారు. దీనిపై రాష్ట్ర బీసీ కమిషన్ సమగ్రమైన నివేదికను రూపొందించిన కేంద్రం పై వత్తిడి తేవాలని మంత్రి కృష్ణమోహన్ రావుకు సూచించారు.
ఈ క్రిమిలేయర్ విధానం వల్ల ఓబీసీలకు రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. వేలాది మంది ఓబీసీ విద్యార్థులకు యూపీఎస్సీలో అమలు చేస్తున్న క్రిమిలేయర్ విధానం వల్ల ఎంతో నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో డైరెక్టుగా గ్రూప్ – 1, సమాంతర పోస్ట్ లకు ఎంపికైన ఉద్యోగులకు, రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వారికి, వృత్తి, వ్యాపార రంగాలలో ఉండి 8 లక్షల రూపాయలు, ఆపైన ఆదాయం గల కుటుంబాల వారికి ఈ క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని నిబంధనలు చెప్తున్నాయి.అవి ఎక్కడ అమలు కావడం లేదన్నారు.
ఇది ఓబీసీ విద్యార్థులకు గొడ్డలి పెట్టన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగులు పొందుతున్న వేతనాల పైన, వారు సాధించిన ప్రమోషన్ ల ఆధారంగా క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయడం దారుణమన్నారు. కింది స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం నేడు గణనీయమైన స్థాయిలో వేతనాలను పెంచడం వల్ల సగటున 8 లక్షల రూపాయల పై వార్షిక వేతనాలను పొందుతున్నారని మంత్రి తెలిపారు.
అలాంటి వారి కుటుంబాలకు చెందిన ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు IAS, IPS లాంటి పోస్టులల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఓపెన్ కేటగిరీలో సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన అభ్యర్థులను రిజర్వేషన్లు జాబితాలోకి తీసుకోవడం దారుణమన్నారు.
ఇది రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు స్ఫూర్తికి గొడ్డలి పెట్టున్నారు. క్రిమిలేయర్ (సంపన్న శ్రేణి) ను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించని కారణంగా గత 5, 6 ఏండ్ల నుండి కోర్టులలో పోరాటం చేస్తున్న వారిని, క్రిమిలేయర్ వల్ల నష్టపోయిన వారిని గుర్తించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా బీసీ కమిషన్ ద్వారా కేంద్రం పై వత్తిడి తేవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తి కి విఘాతమన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తద్వారా కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తేవడానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ భేటీలో మహబూబ్ నగర్ జిల్లా బీసీ సంఘాల ప్రతినిధులు గిరి గౌడ్, తిరుపతి ముదిరాజ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.