హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి అసమ్మతి నేతలు, సీనియర్లు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అధ్యక్షుడైన రేవంత్రెడ్డి లేకుండానే కీలకమైన మేధోమథన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. అమెరికా టూర్లో ఉన్న రేవంత్ తాను వచ్చాక ఈ సమావేశాన్ని నిర్వహిద్దామని చెప్పినప్పటికీ సీనియర్లు పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయన లేకుండా జూన్ 1,2 తేదీల్లో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం చింతన్ శిబిర్ పేరిట సదస్సును నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ సదస్సు నిర్ణయాలపై ఆయా రాష్ర్టాల పీసీసీలు చర్చ నిర్వహించి తీర్మానాలు ఆమోదించాల్సి ఉన్నది. ఇందులో భాగంగానే తెలంగాణలో మేధోమథన సదస్సు నిర్వహించి చర్చించాలని నిర్ణయించారు. అమెరికా నుంచి రేవంత్ జూన్ 6 లేదా 7న తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ సీనియర్లు ఆయన రాకకు ముందుగానే సదస్సు నిర్వహించాలని పట్టుబట్టి పార్టీ మెడలు వంచారు. దాంతో టీపీసీసీ అధ్యక్షుడు లేకుండా కీలకమైన సమావేశం నిర్వహించనుండటం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంలో సీనియర్లు తమ పంతం నెగ్గించుకున్నారనే చర్చ జరుగుతున్నది.
ఇంకా చల్లారని ‘రెడ్ల’ మంటలు
రెడ్లకే అధికారం ఇవ్వాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో రేపిన మంటలు ఇంకా చల్లారడం లేదు. రోజుకో నేత తమ అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలతో రెడ్డి వర్గం ఒకవైపు, బీసీ వర్గం మరోవైపు చీలిపోయాయి. రెడ్డి వర్గంలోనూ రేవంత్రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న మెజార్టీ నేతలు అంతర్గతంగా బీసీ వర్గానికి మద్దతిస్తూ… రేవంత్పైకి ఉసిగొల్పుతున్నట్టు తెలిసింది. అందుకే పలువురు బీసీ నేతలు ఎలాంటి జంకు లేకుండా రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా పలువురు సీనియర్ బీసీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య కూడా రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చిచ్చుపెట్టినట్టు చెప్పుకొంటున్నారు.