హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిన విద్యుత్తు ఉద్యోగుల సర్వీసు బుక్స్ను వెంటనే తెలంగాణకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సోమవారం విచారణ జరిగింది. ఉద్యోగుల తరఫున వాదించిన న్యాయవాదులు.. తమ క్లయింట్లకు పదోన్నతులు, ఇంక్రిమెంట్స్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. జస్టిస్ ధర్మాధికారి కమిటీ సిఫారసుల ప్రకారం విద్యుత్తు ఉద్యోగులను సర్వీసులోకి తీసుకున్నట్టు చెప్పారు.
కొంతకాలంగా రాష్ట్రంలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని, అదే విధానాన్ని ఏపీ నుంచి వచ్చిన వారికి కూడా అమలు చేశామని తెలిపారు. ఏపీ నుంచి వచ్చిన వారి సర్వీసు రికార్డులు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా తమకు అందలేదని, వాటిని పరిశీలించాక పదోన్నతి, ఇంక్రిమెంట్లు అమలు చేస్తామన్నారు. అందుకు 4 వారాలు సమయం కోరారు. దీనికి స్పందించిన ప్రత్యేక ధర్మాసనం.. ఉద్యోగుల సర్వీసు రికార్డులను వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి పంపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల రెండో వారానికి వాయిదా వేసింది.