BJP | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సీనియన్ నేత ఈటల రాజేందర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర అధినేతకు తెలియకుండా ఈటల ఖమ్మం పర్యటన పార్టీలో వర్గపోరుకు తెరలేపినట్టు సమాచారం. గురువారం ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం ఖమ్మం వెళ్లింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యింది. వారిద్దరినీ బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానించింది. ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ, ఈటల బృందం ఖమ్మం వెళ్లినట్టు, పొంగులేటితో భేటీ అయినట్టు బండి సంజయ్కి తెలియదట. స్వయంగా బండి ఈ విషయాన్ని చెప్పారు.
కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. ఈటల బృందం ఖమ్మం వెళ్లిన సంగతి తనకు మీడియాలో చూసిన తర్వాతే తెలిసిందని చెప్పారు. తనకు చెప్పకపోవడం పెద్దనేరమేమీ కాదని కవరింగ్ ఇచ్చారు. తన వద్ద ఫోన్ లేకపోవడం వల్లే సమాచారం ఇవ్వలేకపోయారేమో అంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. కానీ, జీహెచ్ఎంసీలో ఇటీవల బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనకు బండియే మార్గదర్శకుడని, తన వద్ద ఫోన్ లేకపోతే ఎలా వారందరినీ పురమాయించారనే సందేహం వ్యక్తమవుతున్నది. పోలీస్ దర్యాప్తును పక్కదారి పట్టించే ఉద్దేశంతోనే తన వద్ద ఫోన్ లేదని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది.
ఖమ్మం వెళ్లిన ఈటల బృందంలో ఎమ్మెల్యే రఘునందన్రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, ఏలేటి మహేశ్వర్రెడ్డి తదితరులు ఉన్నారు. బీజేపీలో కీలకమైన ఇంత మంది నేతలు రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పకుండా పర్యటించడమంటే, బండిని ధిక్కరించినట్టేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే బీజేపీలో ఈటల, బండి, కిషన్రెడ్డి, ధర్మపురి అరవింద్.. ఇలా అనేక గ్రూపులుగా విడిపోయి కొట్లాడుకుంటున్నారు.
ఈటల ఫెయిల్యూర్ అని ముద్రవేసేందుకు బండి సంజయ్.. బండిని అసమర్థుడని నిరూపించేందుకు ఈటల తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడికి కనీస సమాచారం ఇవ్వకపోవడం అంటే.. బండిని లెక్కచేయనట్టేనని పేర్కొంటున్నారు. తాను ఎంతమందిని బతిమిలాడి బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించినా.. బండి సంజయ్ అడ్డుకుంటున్నారని ఈటల తరుచూ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలిసింది. అందుకే.. పొంగులేటి, జూపల్లితో చర్చలను బండికి తెలియకుండా ఈటల జాగ్రత్తపడుతున్నారని సమాచారం.