ములుగు, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండలాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నది. బుధవారం కూడా పోలీస్, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మా దళం కోసం గాలింపు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు గుట్టపై బాంబులు అమర్చామని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. పోలీసులు ‘బచావో కర్రెగుట్టలు’ పేరుతో స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 250 కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టలను వేలాదిమంది బలగాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. మావోయిస్టుల కదలికల ప్రచారం, పోలీసుల కూంబింగ్తో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
వెంకటాపురం(నూగూరు) కస్తూర్బా పాఠశాల ఆవరణలో భద్రతా బలగాల అధికారులు బుధవారం రెండు హెలికాప్టర్లను మోహరించారు. హెలిప్యాడ్ వైపు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో హెలికాప్టర్లు తిరుగుతున్నాయని, కాల్పుల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయని, ములుగు ప్రాంతంలో ఇంతపెద్ద స్థాయిలో కూంబింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి అని సమీప గామాల ప్రజలు చెప్తున్నారు.