మారేడ్పల్లి, మే 27: దేవగిరి ఎక్స్ప్రెస్ రైల్లో ముంబై నుంచి సికింద్రాబాద్కు హవాలా నగదు తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి రూ.1,22 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ ఆవరణలో రైల్వే డీఎస్పీ జావేద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా, సాయినగర్కు చెందిన విజయ్ అంబదాస్ గుప్తా(40) ముంబైలోని కాంతా జ్యువెలరీ నిర్వాహకుడు సంతోష్ సేఠ్ సూచన మేరకు 1,22,70,000 మోండా మార్కెట్లోని జ్యువెలరీ వ్యాపారం నిర్వహిస్తున్న బండి అనే వ్యక్తికి నగదు అప్పగించాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం దేవగిరి ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా విజయ్ అంబదాస్ గుప్తా అనుమానాస్పదంగా లగేజీ బ్యాగ్తో ప్రయాణం చేస్తూ కనిపించాడు.
దీంతో పోలీసులు అతడిని తనిఖీ చేయగా నగదు లభ్యమైంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకపోవడంతో హవాలా నగదుగా గుర్తించి స్వా ధీనం చేసుకొని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.