హైదరాబాద్ : సికింద్రాబాద్ ఆషాడ బోనాల(Secunderabad Bonalu) ఉత్సవాలు జులై 9 వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. . ఈ సందర్బంగా పాలక మండలి సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి (Telangana Culture)ప్రతీకగా నిలిచే బోనాల(Bonalu) ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) ఆదేశాల మేరకు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని చెప్పారు. ప్రతి సంవత్సరం గోల్కొండ లో బోనాల(Golkonda Bonalu) ఉత్సవాలు ప్రారంభమై తర్వాత సికింద్రాబాద్ బోనాలు, ఓల్డ్ సిటీ బోనాలు(Old City Bonalu) నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
ఈ సంవత్సరం సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన, 10 వ తేదీన రంగం (భవిష్యవాణి) నిర్వహిస్తున్నామని వివరించారు. మహాంకాళి(Mahankali) అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. ఆలయం పరిసరాలలో రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల వ్యయంతో చేసినట్లు చెప్పారు.
అమ్మవారి బోనాల మరుసటి రోజు వివిధ వేషదారణలు, డప్పు చప్పుళ్ళు, కళాకారుల నృత్యాలతో నిర్వహించే ఫలహారం బండ్ల ఊరేగింపు ఉత్సవాలకే ప్రత్యేక శోభను తీసుకొస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ కృష్ణ, EO మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, కిరణ్మయి, గణేష్ టెంపుల్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.