పెద్దపల్లి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఆ చదువుల తల్లికి లక్ష్మీ కటాక్షం కరువైంది. రాత్రింబవళ్లు శ్రమించి బీఎస్సీ నర్సింగ్ సీటు సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ విద్యార్థిని పైసల్లేక ఎక్కడ చదువు మానేయాల్సి వస్తుందోనని తల్లడిల్లుతున్నది. దాతలు ఆపన్నహస్తం అందించాలని వేడుకొంటున్నది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల గ్రామానికి చెందిన ఆరెల్లి లింగయ్య – లక్ష్మీబాయి దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు. ఆ దంపతులు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. లింగయ్య గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందాడు. పిల్లల పోషణ భారం ఆ తల్లిపైనే పడింది. రెండో కూతురైన అంజలి ఇంటర్ జగిత్యాలలోని టీఎస్ఆర్జేసీలో పూర్తి చేసింది.
మెరిట్ ఆధారంగా తార్నాకలోని టీఎస్ఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో సీటు వచ్చింది. బీఎస్సీ నాలుగేండ్లు పూర్తి చేయాలంటే స్కూల్, హాస్టల్ ఫీజు కలిపి ఏడాదికి రూ.80 వేల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ తల్లి వద్ద అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. ఇప్పటివరకు అడ్మిషన్ కోసం రూ.వెయ్యి చెల్లించగా దాతల సాయంతో యూనివర్సిటీ ఫీజుగా రూ.6 వేలు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.75 వేల వరకూ కట్టాల్సి ఉన్నదని అంజలి తెలిపింది. సాయం చేయాల్సిన వారు.. ఆరెల్లి అంజలి, అకౌంట్ నంబర్ 804310100214813, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్0808131, యూనియన్ బ్యాంక్, మంథని బ్రాంచిలో నగదు జమ చేయాలని కోరుతున్నది. వివరాలకు 9963853381 నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.