హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసే ఇంజినీరింగ్ కాలేజీలు పూర్తి డాక్యుమెంట్లను సమర్పించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోతే కాలేజీల అప్రూవల్ స్క్రూటనీ చేయబోమని స్పష్టంచేసింది. ఈ మేరకు వర్సిటీల వైస్చాన్స్లర్లు, కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఏఐసీటీఈ లేఖలు రాసింది. కొంతకాలంగా కాలేజీలు సరైన ధ్రువపత్రాలను సమర్పించకున్నా అనుమతులు పొందుతున్నాయి. కరోనా కారణంగా ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించకుండా అనుమతులిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీటీఈ ఆదేశాలిచ్చింది. జేఎన్టీయూ అధికారులు విచారణ, తనిఖీలు జరపాలని తెలంగాణ స్కూల్, టెక్నికల్ కాలేజెస్ స్టాప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్కుమార్ కోరారు.