SCR | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో పలు రైల్వేస్టేషన్ల మధ్య సంక్రాంతి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా బుధవారం పలు స్టేషన్ల మధ్య సంక్రాంతి రైళ్లు ఏర్పాటు చేశారు. కాచిగూడ-తిరుపతి, తిరుపతి- సికింద్రాబాద్, నాందేడ్- కాకినాడ స్టేషన్ల మధ్య గురువారం నుంచి 16 వరకు రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. బుధవారం నుంచి సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ మొదలైంది.
ఈ పరిణామాలను ముందే అంచనా వేసిన రైల్వే శాఖ సంక్రాంతి పేరుతో ప్రత్యేక రైళ్లను దశలవారీగా ఏర్పాటు చేస్తున్నది. ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ టికెట్ చార్జీలకు బదులుగా, అదనపు చార్జీలు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేక రైళ్లలో 30 నుంచి 50 శాతం వరకు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రత్యేక రైళ్లలో కూడా సాధారణ చార్జీలే వసూలు చేయాలి ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నా, దీనిపై రైల్వే అధికారులు మాత్రం స్పందించడం లేదు. రైల్వే బోర్డు తీసుకునే నిర్ణయం ప్రకారమే అదనపు చార్జీలు వసూలు చేయడం, చేయకపోవడం అనే అంశం ఆధారపడి ఉంటుందని పలువురు రైల్వే ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.