హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. విశాఖపట్నం – మహబూబ్నగర్, కాచిగూడ – కొల్లం రైల్వే స్టేషన్ల పరిధిలో 20 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో విశాఖపట్నం- మహబూబ్నగర్ స్టేషన్ల మధ్య ఎనిమిది, కాచిగూడ – కొల్లం స్టేషన్ల మధ్య 12 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం – మహబూబ్నగర్ మధ్య డిసెంబర్ 6 నుంచి 27వ తేదీ వరకు, మహబూబ్నగర్ – విశాఖపట్నం మధ్య డిసెంబర్ 7 నుంచి 28 వరకు అందుబాటులో ఉండనున్నాయి. కాచిగూడ – కొల్లాం స్టేషన్ల మధ్య డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. కొల్లాం – కాచిగూడ మధ్య డిసెంబర్ 7, 14, 21, 28, జనవరి 4, 11 తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ టు టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచెస్ కూడా అందుబాటులో ఉండనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.