హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి (Kantakapally) వద్ద ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703), హౌరా-బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్ (12245), షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ (18045), చెన్నై-హౌరా ఎక్స్ప్రెస్ (12840) రైళ్లు ఉన్నాయి. వీటితోపాటు విశాఖపట్నం-గుణుపూర్, విశాపట్నం-రాయగడ, విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దుచేసినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం రాత్రి విజయనగరం (Vizianagaram Train Accident) జిల్లాలోని కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఒకే ట్రాక్పై ఆగిఉన్న రైలును మరో రైలు ఢీకొట్టింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు ఓవర్ హెడ్ విద్యుత్తు వైర్లు తెగిపోవడంతో పట్టాలపై ఆగిపోయింది. ఆగి ఉన్న ఈ ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ ఎక్స్ప్రెస్ వెనుక నుంచి ఢీకొన్నది. దీంతో రాయగడ ప్యాసింజర్ రైలు చివరి మూడు భోగీలు పట్టాలు తప్పాయి. అవి ఎదురుగా వస్తున్న గూడ్స్ ఇంజిన్ను ఢీకొట్టాయి. దీంతో ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొన్నది. ఈ ప్రమాదం ఇప్పటివరకు 16 మంది మరణించారు. వారిలో ఇద్దరు లోకోపైలట్లు, గార్డు కూడా ఉన్నారు. మరో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి.