హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తేతెలంగాణ): భారత శాస్త్రవేత్తలు కొత్త జాతి మొక్కను కనుగొన్నారు. అండమాన్ ఆర్చిపెలాగో (దీవుల సముదాయం)లో గుర్తించిన ఈ మొక్కకు ‘జలకన్య’ (మెర్మయిడ్)గా నామకరణం చేశారు. ‘అసిటబులేరియా’ అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ మొక్కకు చాలా అందమైన పూలు పూస్తాయి. చాలా ప్రత్యేకతలున్న ఈ పూలతో ఎన్నో ప్రయోజనాలున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. 2019లోనే ఈ మొక్కను కనుగొన్నప్పటికీ, దానిపై సుదీర్ఘ పరిశోధనలు జరిపి కొత్త రకం మొక్కగా నిర్ధారించేందుకు ఇన్నాళ్లు పట్టిందని పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. చాలా అందమైన ఈ మొక్కకు గొడుగుల్లాంటి పల్చటి ఆకులు ఉంటాయి. వాటి మధ్యలో జలకన్య లాంటి ఆకృతి ఉన్నందున ఆ మొక్కకు మెర్మయిడ్ అనే పేరు పెట్టినట్టు ఫెక్లీ బస్తీ అనే శాస్త్రవేత్త వివరించారు.