హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరంలో 1- 10వ తరగతి విద్యార్థులకు 166 రోజులపాటు పాఠశాలలు నడుపనున్నారు. ఈ మేరకు 2021-22 సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ అధికారులు తయారుచేశారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) అధికారులు ఈ క్యాలెండర్ రూపొందించారు. ఆమోదం కోసం దానిని ఉన్నతాధికారులకు పంపించారు. విద్యాసంవత్సరంలో ఇప్పటికే మూడు నెలలు గడిచిపోవడంతో ఈ ఏడాది దసరా, సంక్రాంతి పండుగల సెలవులను కుదించనున్నారు.
అన్ని రకాల పరీక్షలు..
కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చి, పరిస్థితులు అనుకూలిస్తే ఎస్సెస్సీ విద్యార్థులకు మార్చి, ఏప్రిల్ మాసాల్లో వార్షిక పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలను సైతం నిర్వహించనున్నారు.