హైదరాబాద్ : గిరిజన తెగల్లో ఒకటైన ఎరుక కులస్తులు.. రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించి, తప్పకుండా జీవనోపాధి కల్పిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని డీఎస్ఎస్ భవన్లో ఎరుకల సంఘం నాయకులతో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరుకలు మొదట్నుంచి పందుల పెంపకంతో పాటు బుట్టలు, తట్టలు అల్లుతూ జీవనోపాధి పొందేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో వారి జీవనోపాధి కష్టంగా మారిందని తెలిపారు. దేశవ్యాప్తంగా పంది మాంసానికి డిమాండ్ ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకదారులకు గొర్రెలు ఇచ్చినట్టే, తమకు పందులను ఇవ్వాలని ఫామ్ లు ఏర్పరచుకొని జీవనోపాధి పొందుతామని అందుకు ప్రభుత్వం సహాయమందించాలని ఎరుకలు కోరినట్లు మంత్రి తెలిపారు.
ఈ బడ్జెట్లో ఎరుకల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు కేటాయించాలని వారు కోరినట్లు సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఎరుకల సమస్యలను ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా పరిష్కార దిశగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులన్నీ, గిరిజనుల్లో ఉండే అన్ని తెగలకు సమానంగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు, రవికుమార్, గోపాల్, శ్రీరామ్ ఆనంద్, రాజశేఖర్ నాగులు, శ్రీశైలం, మల్లేశం, సత్యనారాయణ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.