హైరదాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదే రోజున నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని డిసెంబర్ 1వ తేదీలోగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎమ్మెల్సీలు ఆకుల లలిత, నేతి విద్యాసాగర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, మహమ్మద్ ఫరీదుద్దీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీకాలం జూన్ 3న ముగిసింది. కరోనా నేపథ్యంలో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో అప్పటి నుంచి ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.