హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)కి కార్యదర్శిగా ఎవరు వస్తారో తెలియదు? వచ్చి న వారు ఎప్పటి వరకు ఉంటారో? అసలే బోధపడదు. ప్రభుత్వం వారిని ఎప్పుడు మారుస్తుందో, ఎవరికి బాధ్యతలు అప్పగిస్తుం దో? ఎవరికీ అంతుబట్టదు. ఇప్పటివరకూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ముగ్గురు కార్యదర్శులు అలా వచ్చారు.. ఇలా వెళ్లారు. కొద్దికాలంలోనే ఆ ముగ్గురు కార్యదర్శులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం కార్యదర్శిని ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం.. ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శికి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇలా పూర్తిస్థాయి కార్యదర్శి లేకపోవడంతో సొసైటీ పరిధిలోని గురుకులాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి.
గురుకుల విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో అవస్థలు పడుతున్నారు. సొసైటీ ప్రధాన కార్యాలయంలో కోటరీగా ఏర్పడిన కొందరు అధికారుల ముఠా ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతున్నది. దీంతో రోజుకో కొత్త సమస్య కూడా పుట్టుకొస్తున్నది. మరోవైపు అక్రమ మార్గాల్లో, అర్హతల్లేకున్నా కూడా ప్రధాన కార్యాలయంలో ఏండ్లుగా తిష్టవేసిన ఆ కోటరీ వర్గం అన్నింట్లో పెత్తనం చెలాయిస్తున్నది. సదరు శాఖకు అమాత్యుడున్నా, సమస్యలను ఆయనకు ఎన్నిమార్లు విన్నవించినా కనీసం పట్టించుకోని దైన్యం నెలకొన్నదని బాధితులు పేర్కొంటున్నారు. ఎస్సీ గురుకుల సొసైటీలో గందరగోళంగా నెలకొన్నది. ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా పరిస్థితి తయారైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పూర్తిగా సొసైటీనే నిర్వీర్యమైపోతుందని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా సీతాలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. అనంతరం కొద్దినెలలకే ఆమె స్థానంలో అలుగు వర్షిణిని కార్యదర్శిగా నియమించింది. దాదాపు ఏడాదిపైగా కొనసాగిన ఆమె గతేడాదే కేంద్ర సర్వీస్లోకు వెళ్లారు. ఆమె స్థానంలో ప్రభుత్వం మళ్లీ కొంతకాలం సీతాలక్ష్మికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత సొసైటీ కార్యదర్శిగా అప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా కొనసాగుతున్న కృష్ణ ఆదిత్యకు సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను సర్కార్అప్పగించింది. మూడు నెలల క్రితమే ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించి, ఆయన స్థానంలో కార్యదర్శిగా విజయేందిర బోయిని పూర్తికాలపు కార్యదర్శిగా సర్కార్ నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె సెలవుపై వెళ్లారు. దీంతో ప్రభుత్వం మళ్లీ కృష్ణ ఆదిత్యకే అదనపు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఆమెను ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీగా నియమిస్తూ బదిలీ చేసింది. ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను సైతం ఆమెకే ప్రభుత్వం అప్పగించింది. పూర్తికాలపు కార్యదర్శిని మాత్రం నియమించలేదు. తరచూ కార్యదర్శులు మారుతుండటంతో ఎస్సీ గురుకులాల సొసైటీలో పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది. సమస్యలు పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది.