హైదరాబాద్, మార్చి18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రమోషన్ల ఊసే కానరావడం లేదు. 2018 నుంచి ఎలాంటి మార్పులు లేక వారంతా వెనుకబడి ఉన్నారు. వీరితోపాటే ఎంపికైన బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో 2021లో ఒకసారి, ఇదే విద్యాసంవత్సరంలో మరోసారి ప్రమోషన్లు కల్పించారు. గిరిజన గురుకులాల ప్రమోషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకున్నది. కానీ, తమ ప్రమోషన్ల ఊసే లేకుండా పోయిందని ఎస్సీ గురుకుల సొసైటీ ఉద్యోగులు వాపోతున్నారు. 317 జీవోను సాకుగా చూపుతూ దాటవేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఎస్సీ గురుకులాల్లో 2018, 2019లో నియామకాలు జరిగాయి. ఆ బ్యాచ్కు చెందిన మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇప్పటికే రెండుసార్లు ప్రమోషన్లను పొందారు. మైనార్టీ గురుకుల సొసైటీలోని ఉద్యోగులకు ఒక దఫా ప్రమోషన్లను కల్పించారు.
ఎస్సీ గురుకుల సొసైటీలోనే 250 మంది టీజీటీ, 150 మంది పీజీటీ, 100 మంది జూనియర్ లెక్చరర్లు, 20 మంది డిగ్రీ లెక్చరర్లు ప్రమోషన్లు రాక, హోదాపరంగానూ వెనుకబడిపోతున్నారు. ప్రొబేషనరీ డిక్లేర్ చేసే సమయానికి 317 జీవో వివాదం మొదలైందని దీంతో ప్రమోషన్ల ప్రక్రియ మరింత జఠిలంగా మారింది. 317 జీవోను సవాల్ చేస్తూ అనేక మంది కోర్టుకు వెళ్లారని, ఇప్పుడు ఆ కేసులనే సాకుగా చూపి ప్రమోషన్ల ప్రక్రియనే ఏండ్లుగా నిలిపివేశారని వారంతా వాపోతున్నారు. గురుకులాల జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రజాభవన్కు, సొసైటీ కార్యాలయాల్లో తమ గోడు వెళ్లబోసుకున్నా నేటికీ ఫలితం దక్కలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల కోడ్ ముగిసే సమయానికి ప్రమోషన్ల కోసం ముందస్తు కసరత్తును పూర్తి చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుతున్నారు.