హైదరాబాద్ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ బక్కి వెంకటయ్య ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఎస్సీ, ఎస్టీ కమిషన్ కమిషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించడం పట్ల డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కొప్పుల వెంకటయ్యను అభినందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తనవంతు సహకారం అందిస్తానని మంత్రి చెప్పారు.
కాగా, కమిషన్కు నూతన చైర్మన్, సభ్యులను సీఎం కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. కమిషన్ నూతన చైర్మన్గా మెదక్ జిల్లాకు చెందిన బక్కి వెంకటయ్య (ఎస్సీ మాల), సభ్యులుగా కుస్రం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (ఎస్టీ లంబాడా, దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ (ఎస్సీ మాదిగ, కరీంనగర్), జిల్లా శంకర్ (ఎస్సీ మాదిగ, నల్లగొండ), రేణికుంట ప్రవీణ్ (ఎస్సీ మాదిగ, ఆదిలాబాద్)ను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.