హైదరాబాద్, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ): ప్రమాదవశాత్తు విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో ఇస్త్రీ డబ్బా, దానిలో దుస్తులు కాలి నష్టపోయిన బాధిత రజక కుటుంబాలకు రజక ఫెడరేషన్ ద్వారా రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రజక సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన సలహాదారు కొండూరు సత్యనారాయణ తెలిపారు. వృత్తి పనుల్లో చెరువుల్లో చనిపోయిన బాధిత రజక కుటుంబాలను ప్రభుత్వం ఇప్పటికే ఆదుకుంటున్నదని తెలిపారు. రాష్ట్రంలోని 76 వేల మంది రజకులకు 250 యూనిట్ల చొప్పున ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నదని వివరించారు. ఇటీవలే వనపర్తి జిల్లాకు చెందిన జలనీల జ్యోతి నాగరాజు, నాగర్కర్నూలు జిల్లా చిన్న కొత్తపల్లికి చెందిన తిప్పరాజు తిరుపతమ్మ చంద్రమౌళి దంపతులకు రూ.50 వేల చొప్పున పరిహారం కింద ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు. రజకులను అన్నివిధాలుగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రజక జాతి రుణపడి ఉంటుందని సత్యనారాయణ తెలిపారు.