హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీ హిందూమతాన్ని అపహాస్యం చేస్తున్నారని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి మండిపడ్డారు. జీ20 దేశాధినేతల సదస్సు సందర్భంగా శివలింగాలను ఫౌంటెయిన్లుగా ఏర్పాటు చేయడంపై గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శివలింగం వినోదం కోసం కాదని, ఆ విషయాన్ని ఇకనైనా మోదీ గ్రహించాలని హితబోధ చేశారు. శివలింగం పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించారని, తక్షణమే ఆ ఫౌంటెయిన్లను తొలిగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 దేశాధినేతల సదస్సు జరగనున్నది. దీనికోసం హనుమాన్ మందిర్ జంక్షన్లో శివలింగం ఆకారంలో 18 ఫౌంటెయిన్లను ఏర్పాటు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని హిందువులు, ప్రతిపక్ష నేతలు మోదీ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.