హైదరాబాద్ : సర్దార్ సర్వాయి పాపన్న సబ్బండ వర్ణాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao ) , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar Goud ) అన్నారు. మంగళవారం రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల కల్లు సొసైటీల ఆధ్వర్యంలో మైలార్ దేవులపల్లిలో నిర్వహించిన సన్మాన సభలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సర్వాయి పాపన్న(Sarvai Papanna) ఇచ్చిన స్పూర్తితో, ఆయన వారసులుగా గౌడ సామాజిక వర్గంలో గొప్ప నాయకత్వ లక్షణాలు, అందరినీ ఏకీకృతం చేయగల సామర్ధ్యం, చైతన్యం ఉందని తెలిపారు. పీడిత వర్గాల వీరత్వానికి ప్రత్యేకగా నిలిచిన సర్వాయి పాపన్న చరిత్రను భావితరాలకు అందించేందుకు పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రిగా కృషి చేస్తానని చెప్పారు. ఖిలాస్పూర్, తాటికొండ, సర్వాయిపేట కోటలను రక్షిత కట్టడాలుగా గుర్తించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహాన్ని(Papanna Statue) ప్రతిష్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన లేదా ప్రమాదవశాత్తు శాశ్వత అంగ వెకల్యం పొందిన గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా పెంచే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నీరాతో పాటు కల్లు ఉప ఉత్పత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం అధ్యయనం చేసి గౌడలకు మరింత జీవనోపాధి కలిగించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, కార్యనిర్వాహకులు టి. ప్రేమ్ దాస్ గౌడ్, సి. హరిచరణ్ గౌడ్, ఎం. కాశీవిశ్వనాథ్ పాల్గొన్నారు.