హైదరాబాద్: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదని సర్పంచుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు కలిసిశారు. 15వ ఆర్థిక సంఘం పెండింగ్ బకాయిలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను, 15వ ఆర్థిక సంఘం నిధులను గత కొద్ది నెలలుగా నిలిపివేసిందని, దీనివల్ల స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు పనులకు బిల్లులు రాకపోవడంతో సర్పంచులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చామన్నారు. వెంటనే ఆ నిధులు వచ్చేలా కేంద్రంపై వత్తిడి తేవాలని విజ్ఞప్తిచేశామన్నారు. ఉపాధి హామీలో మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్ ఆగిపోయాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్నదని వెల్లడించారు.
కేంద్రం నిధులు నిలిపేసినప్పటికీ రాష్ట్రం మాత్రం నిధులు ఇస్తూనే ఉందన్నారు. రాష్ట్రంపై కేంద్రం ప్రభుత్వం కావాలనే వివక్ష చూపుతున్నదని విమర్శించారు. మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వారిలో తెలంగాణ సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య, బూడిద రామ్రెడ్డి, ఉదయశ్రీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.