కేరళ అమృతపురి నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: సర్వమానవాళి సుఖసంతోషాలతో ఉండే అమృతానందలోకాన్ని నిర్మిద్దాం అని మాతా అమృతానందమయిదేవి పిలుపునిచ్చారు. శాంతి, సంతోష సమాజం కోసం ప్రతి ఒకరూ పాటుపడాలని సూచించారు. మాతా అమృతానంద 70వ జన్మదినాన్ని పురసరించుచుకొని కేరళలోని అమృతపురి (వల్లికాపురి) శోభాయమనమైంది. ప్రపంచ నలుమూలల నుంచి వందల మంది అమృతానందమయిదేవి భక్తులు, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి వేల మంది మంగళవారం అమృతపురికి చేరుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేడుకలు వైభవంగా సాగాయి. అమ్మ సందేశం, ప్రార్థనతో సప్తవర్ష సంరంభం ప్రారంభమైంది.
వేల మంది భక్తుల కోసం అమ్మ తన జన్మదిన సందేశాన్ని ఇచ్చారు. శాంతి, సంతోషం, ప్రేమ, కరుణను పంచేందుకు ప్రపంచ మానవాళి పాటుపడాలని పిలుపునిచ్చారు. మానవజన్మ ఎత్తినందుకు గర్వపడాలని, బాధలమయ ప్రపంచం నుంచి మనుషులు బంధాలమయి ప్రపంచం కోసం ఎవరికి వారి యథాశక్తి ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. కాలువల్లో పారే మురుగు నీరు భూమిని కల్లోలానికి గురి చేస్తున్నట్టే మనిషి చెడు ఆలోచనలు, విపరీత చేష్టల వల్ల తన శరీరాన్ని మలినం చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మనకెంత సంపద ఉన్నా, మన చుట్టూ గంపెడు బలగం ఉన్నా ఆపద సంభవించినప్పుడు మనతో ఏ సంపద, ఏ బలగం రాదని.. కొవిడ్ కాలం అదే చెప్పిందనే విషయం ప్రతి ఒకరూ గుర్తుంచుకోవాలని సూచించారు.
ప్రధాని సహా పలువురి సందేశాలు
అమ్మ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు రాజనాథ్ సింగ్, నితిన్ గడరీ సహా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు వీడియో సందేశాలు పంపారు. అమెరికా, యూఎన్ సభ్యదేశాల ప్రతినిధులు, జాతీయ, అంతత్జాతీయ సినిమా ప్రముఖులు అమ్మకు వీడియో సందేశాలు పంపేందుకు పోటీపడ్డారు. 193 దేశాల నుంచి, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆయా ప్రాంతాల నుంచి మట్టిని తెచ్చి అమ్మకు సమర్పించారు. ప్రపంచం అంతా ఒకటే అనే సందేశాన్ని అమ్మ తన 70వ సప్తతిని పురషరించుకొని ప్రతినిధులు తెచ్చిన మట్టిని ఒక ముద్దగా చేసి.. ఆ మట్టి ముద్దను ప్రార్థించారు.
అనంతరం ఆ మట్టిలో మొకను నాటి దానికి విశ్వ ప్రేమ వృక్ష అని నామకారణం చేశారు. మాతా అమృతానందమయిదేవికి 2023 సంవత్సరానికి వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును బోస్టన్ గ్లోబల్ ఫోరమ్ అందజేసింది. అమ్మ జన్మదినోత్సవం సందర్భంగా అమృతపురి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు వారి వారి జాతీయ జెండాలను చేబూని తమ శుభాకాంక్షలను అమ్మకు తెలియజేశారు. దేశంలోని రాష్ట్రాల ప్రతినిధులు ఆయా ప్రాంతాల సంసృతి సంప్రదాయాలు ప్రతిబింబించే ఆహార్యంతో విచ్చేశారు. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, లక్షద్విప్ సహా పలు ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు అమ్మ జన్మదినం సందర్భంగా సామూహిక వివాహాలు నిర్వహించారు.