హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యమిచ్చి త్వరగా పూరి ్తచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. హరితహారం లక్ష్యసాధనలో కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, ఆ జిల్లాలు వారంలోగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో భాగంగా కొన్ని జిల్లాల్లో భూమి గుర్తించినా, ఇంకా ప్లాంటేషన్ పూర్తి చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా మల్టీ లెవెల్ ఎవెన్యూ ప్లాంటేషన్ను యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాల విషయంలో తొలివిడతగా అన్ని గ్రామపంచాయతీల్లో స్థలాలు గుర్తించి పరికరాలు అమర్చి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమీక్షించి గడువులోగా పనులు పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్లో గ్రామీణాభివృద్ధి అడిషనల్ కమిషనర్ ప్రసాద్, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్లు జాన్ వెస్లీ, రామారావు తదితరులు పాల్గొన్నారు.