కారేపల్లి, ఏప్రిల్ 14: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు ఘటనలో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈనెల 12న గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా పలువురు గాయపడిన విషయం తెలిసిందే. వారిలో నిమ్స్లో చికిత్స పొందుతూ నికోడే సందీప్ (38) శుక్రవారం రాత్రి మృతిచెందాడు. మహారాష్ట్రకు చెందిన సందీప్ ఉపాధి కోసం కొద్దిరోజుల క్రితం భార్య, కుమారుడితో కలిసి కారేపల్లి మండలానికి వలసవచ్చాడు. సుతారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 12న చీమలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యాడు. పేలుడు ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు సందీప్ను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని నిమ్స్లో చేర్పించగా, చికిత్స పొందుతూ సందీప్ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.