మిడ్జిల్, ఫిబ్రవరి 21: సీజ్ చేసిన ఇసుక తరలింపు అనుమతులను రద్దు చేయాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నాగర్కర్నూల్ జిల్లా మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లిలో ‘మన ఊరు-మన ఇసుక’ అంటూ సుమారు 100 మంది రైతులు, గ్రామస్థులు ర్యాలీ చేపట్టి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గతంలో దుందుభి, ఇతర వాగుల నుంచి సేకరించి అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో డంప్ చేసిన ఇసుకను సీజ్ చేశారని తెలిపారు.
ప్రభుత్వ పనులకు ఇసుకను వినియోగించాలని జిల్లా కలెక్టర్ అనుమతులు ఇచ్చారని, అయితే.. ఆ అనుమతులు రద్దు చేసి గ్రామంలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం తెలుసుకున్న సీఐ నాగార్జున, ఎస్సై ఆనంద్ అక్కడికి చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు. సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దీంతో స్థానికులు శాంతించారు. ఇసుక క్వారీ కాంట్రాక్టర్లకు, స్థానికులకు రెండు, మూడ్రోజులుగా తరలింపు విషయంలో వాగ్వాదం నడుస్తున్నది.