తాడ్వాయి, ఫిబ్రవరి 9: మేడారంలో బుధవారం సమ్మక్క-సారలమ్మ పూజారులు మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. వనదేవతల ఆలయా లను, పూజా సామగ్రిని శుద్ధిచేశారు. పూజారుల కుటుంబాలకు చెందిన ఆడపడుచులు అలుకుపూతలు నిర్వహించి ముగ్గులతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి, డోలి వాయిద్యాల నడుమ బొడ్రాయి, పోశమ్మ గుళ్లకు చేరుకొన్నారు. గ్రామ శివారులో మామిడి తోరణాలు, ఆనపకాయతోపాటు కోడిపిల్లను కట్టి ఎలాంటి దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా కట్టు వేశారు. ధ్వజస్తంభాల వద్ద కల్లు సాక పెట్టారు. మండమెలిగే పండుగతో మహాజాతర ప్రారంభమైనట్టు పూజారులు సంకేతాలు ఇచ్చారు.
నేడు జంపన్నవాగుకు నీటి విడుదల
గోవిందరావుపేట: మేడారం జాతరకు వచ్చే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా లక్నవరం సరస్సు నుంచి జంపన్నవాగుకు గురువారం ఐబీ అధికారులు నీటిని విడుదల చేయనున్నారు.