అచ్చంపేట : చైత్రపౌర్ణమి సందర్భంగా నాగర్కర్నూలు(Nagar kurnool) జిల్లాలోని సలేశ్వరం జాతర(Saleswaram jatara) చివరి రోజు శుక్రవారం శివనామస్మరణతో మారుమ్రోగింది. తెలంగాణ అమరనాథ్(Telangana Amarnath) యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకే భక్తులను లోపలికి అనుమతించారు. వీరంతా స్వామి దర్శనం అనంతరం శనివారం తెల్లవారుజామున తిరిగి రానున్నారు.
దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండా కోనల్లో వెలిసిన లింగమయ్య(Lingamaiah)ను దర్శించుకునేందుకు మూడురోజులల పాటు సుమారు 6 వేలకుపైగా వాహనాల్లో 4 లక్షల వరకు భక్తులు దర్శనాని(Darsanam)కి తరలివచ్చారు. చివరి రోజు సుమారు లక్ష మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలు, మోటార్సైకిళ్లు, బస్సుల్లో భక్తులు తరలివచ్చారు.
భక్తులు కాలినడకన కొండలు, వంకలు ఎక్కుతూ..దిగుతూ.. రాళ్లూరప్పలను దాటుకుంటూ లోతట్టు లోయలోని స్వామివారిని దర్శించుకున్నారు. లోయలో గుండం వద్ద ప్రమాదకర దారి మీదుగా చిన్నా, పెద్ద, వృద్ధులు సైతం లింగబేధం లేకుండా స్వామి సన్నిధికి చేరి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.