Engineering Colleges | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాల ధనదాహానికి అంతులేకుండా పోతున్నది. బీ క్యాటగిరి సీట్లను ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్నాయి. బీ క్యాటగిరీ సీట్లకు నోటిఫికేషన్ వెలువడక ముందే, కనీసం తొలి విడత ఎంసెట్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపైనా పూర్తికాక ముందే సీట్ల అమ్మకాలకు తెగబడుతున్నాయి. ఎంసెట్ ర్యాంక్లు విడుదల కావడమే ఆలస్యం బేరసారాలకు తెరలేపాయి. ఎంక్వయిరీల కోసం నేరుగా కాలేజీలకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులకు బీ క్యాటగిరీ సీట్లు అయిపోయాయని, ఒకటో రెండో మిగిలాయని చెప్తూ మరోవైపు బ్రోకర్లు, ఏజెన్సీల ద్వారా సీట్లను అమ్మకానికి పెట్టి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్ అన్ని బ్రాంచీల్లో కెల్లా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)కు అధిక క్రేజ్ ఉండటంతో ఒక్కొక్క సీటును కొన్ని కాలేజీలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరం పెడుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తమ కాలేజీలకు న్యాక్, ఎన్బీఏ, అటానమస్ హోదా ఉన్నదంటూ డొనేషన్తోపాటు తెలంగాణ ఫీజు రెగ్యులేషన్ కమిటీ నిర్ణయించిన ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, లైబ్రరీ ఫీజులు, మరికొన్ని ప్రత్యేక ఫీజులు చెల్లించాలని హైదరాబాద్ శివారు కాలేజీలు షరతులు విధిస్తున్నట్టు సమాచారం. నిజానికి కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసిన తరువాతనే ఆయా యాజమాన్యాలు బీ క్యాటగిరీ సీట్ల అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉంటుంది. అది కూడా నోటిఫికేషన్ వెలువడిన తరువాత, విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్, ఇంటర్మీడియట్ మార్కుల ప్రాతిపదికన వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. సేవాభావంతో పనిచేసే కొన్ని కాలేజీలు మినహా చాలా యాజమాన్యాలు డబ్బులు కుమ్మరించినవారికే సీట్లు ఇస్తున్నాయనేది తల్లిదండ్రుల ఆవేదన. ఆక్రందన. యాజమాన్య కోటా సీట్ల విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను అన్ని యాజమాన్యాలు తూ.చ. తప్పకుండా అమలుచేసేలా అధికారులు కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.