ఎండీ సజ్జనార్ వెల్లడి.. సిబ్బంది హర్షాతిరేకాలు
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ జీతాలు శుక్రవారం ఒకటో తారీఖునే బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో సిబ్బంది ఖుషీఖుషీగా ఉన్నారు. గతకొద్ది రోజులుగా టీఎస్ఆర్టీసీలో అన్నీ సానుకూల పరిణామాలే కనిపిస్తుండటంతో సంస్థలో పనిచేస్తున్న దాదా పు 49 వేల మంది ఉద్యోగుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓవైపు సంస్థ పురోగతితో పాటు ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇకమీదట ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు అందుతాయని భరోసా ఇస్తూ ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ ముందుగానే దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘సిబ్బంది అంతా నిబద్ధత, శ్రద్ధ, బాధ్యతతో, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం’ అని పిలుపునిచ్చారు.