రుక్మాపూర్ (కరీంనగర్) సైనిక్ స్కూల్, బీబీనగర్ ( బీబీనగర్) మహిళా సైనిక్ డిగ్రీ కాలేజీ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ప్రవేశాలకు మార్చి 27న పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో నడిచే ఈ సైనిక్ స్కూల్, సైనిక్ డిగ్రీ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు చాలా బాగున్నాయని, ఒక మాటలో చెప్పాలంటే అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. వీటిలో విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దుతున్నారని, వీరికి అత్యుత్తమ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంతునాయక్ ప్రవేశ పరీక్షలు, ఫలితాల గురించి మంత్రికి వివరించారు. రుక్మాపూర్ పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశ పరీక్ష 3, 550 మంది రాయగా, ఫిజికల్, మెడికల్ టెస్టుల తర్వాత 78 మందికి ప్రవేశాలు లభించాయని నాయక్ తెలిపారు.
సొసైటీలోని 30 మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ఎంట్రెన్స్ టెస్టుకు హాజరైన 25వేల మందిలో 965 మంది బీబీనగర్ కాలేజీని కోరుకున్నారని, వీరిలో 126 మందికి మాత్రమే ప్రవేశాలు లభించాయని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ సెక్రటరీ రోనాల్డ్ రాస్ విద్యార్థినీ, విద్యార్థులకు శుభాభినందనలు తెలిపారు.