హైదరాబాద్, జూలై1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన యువ వైద్యుడు డాక్టర్ పిల్లారిశెట్టి సాయిరామ్ ప్రతిష్ఠాత్మక డయానా పురస్కారానికి ఎంపికయ్యారు. బ్రిటన్కు చెందిన వేల్స్ యువరాణి డయానా జ్ఞాపకార్థం ఆమె భర్త ప్రిన్స్ చార్లెస్, కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ ఈ అవార్డును నెలకొల్పారు. విజన్, సామాజిక ప్రభావం, ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం, యువ నాయకత్వం, సేవా అనే ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. సామాజిక సేవా రంగంలో ఈ అవార్డుకు ఎంపికైన సాయిరామ్ హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రాఘురామ్, వైజయంతి దంపతులకు పెద్ద కుమారుడు. ఆయన బ్రిటన్లో మెడిసిన్ చదువుతున్న రోజుల్లో బ్రిటిష్ ఇంటర్నేషనల్ డాక్టర్ అసోసియేషన్ (బిడా)కు అనుబంధంగా స్టూడెంట్ వింగ్ను ఏర్పాటుచేశారు. ఈ వింగ్ అంతర్జాతీయ వైద్య విద్యార్థులకు ఉచిత విద్య వెబ్నార్లు, కెరీర్ మార్గదర్శకత్వం, మానసిక ఆరోగ్యం తదితర అంశాల్లో మద్దతుగా నిలుస్తున్నది. అవార్డుకు ఎంపిక కావడం పట్ల సాయిరామ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. సాయిరామ్కు బిడా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కన్నెగంటి చంద్ర శుభాకాంక్షలు తెలియజేశారు.