ముంబై, అక్టోబర్ 6: దేశీయ కరెన్సీ రూపాయి విలువ హఠాత్తుగా పతనం చెందింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో డాలర్తో పోల్చితే మారకం విలువ బుధవారం ఒక్కరోజునే 54 పైసలు కోల్పోయింది. 5 నెలల కనిష్ఠస్థాయి 74.98 వద్ద ముగిసింది. అలాగే ఒకేరోజున ఇంతగా కరెన్సీ పతనంకావడం గత ఆరునెలల్లో ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఏడాది గరిష్ఠస్థాయికి బలపడటం, ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు జరగడం రూపాయి క్షీణతకు కారణమని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. విదేశీ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 94 స్థాయిని అధిగమించింది. మరోవైపు ప్రపంచ ప్రధాన స్టాక్ సూచీలు తగ్గుతున్న నేపథ్యంలో తాజాగా బీఎస్ఈ సెన్సెక్స్ 555 పాయింట్లు నష్టపోయింది. మంగళవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,900 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు ఎక్సేంజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.