హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఇటీవల పార్టీలో చేరిన నేతలంతా ‘కొత్త కుంపటి’ పెడుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటెద్దు పోకడలు పెరిగిపోయాయని, నియంతలా వ్యవహరిస్తున్నారని ఎప్పటి నుంచో సొంత పార్టీ నేతలే చెపుతున్నారు. ఆయన వ్యవహారశైలి నచ్చక చాలామంది పార్టీని వీడుతున్నారని, కొత్త నేతలెవరూ రావడం లేదని విమర్శిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. సమావేశాలకు సరిగ్గా ఆహ్వానించకపోవడం, పదే పదే అవమానాలకు గురిచేయడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అనే నిఘా పెట్టడం వారిని తీవ్రంగా కలచివేస్తున్నట్టు సమాచారం. దీంతో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వంటి నేతలంతా ఒక గ్రూప్గా ఏర్పడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. వీరంతా కలిసి ఒకేసారి కాంగ్రెస్ గూటికి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతున్నది. ఈ విషయం తెలుసుకొన్న సంజయ్ శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో ఏవైనా సమస్యలుంటే చర్చించుకొని పరిష్కరించుకుందామని, బయటకు వెళ్లిన నేతలు తిరిగి రావాలని వేడుకొన్నారు. ఇప్పటికే పార్టీలో కొత్త చేరికలు ఎందుకు లేవని, కొందరు ఎందుకు వెళ్లిపోతున్నారని ఢిల్లీ నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తుండటంతో బండి భయపడుతున్నట్టు తెలిసింది. అందుకే ఒక మెట్టు దిగి వచ్చాడని, తాను తప్పు చేస్తే కార్యకర్తకైనా అడిగే హక్కు ఉన్నదంటూ వ్యాఖ్యానించారని అనుకొంటున్నారు.