Raj Bhavan | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం కోరుతూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే కనీస స్పందన కరువైందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆరోపించింది. గవర్నర్ కార్యాలయానికి సహచట్టం వర్తించదా? అని ప్రశ్నించింది. సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి మంగళవారం హైదరాబాద్లో మాట్లాడారు. గవర్నర్గా తమిళిసై పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని పర్యటనలు చేశారు? అందుకు ఎంత ఖర్చు చేశారు? తమిళిసై ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎట్ హోం కార్యక్రమాలు ఎన్నిసార్లు నిర్వహించారు? అందుకు ఎంత ఖర్చు చేశారు? వాటి వివరాలు ఇవ్వాలంటూ ఆర్టీఐ దరఖాస్తు ఇచ్చామని తెలిపారు.
మహిళా దర్బార్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఇప్పటివరకు ఎన్ని వారాలు నిర్వహించారు, అందులో ఎంతమంది బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు? వాటిపై మీరు తీసుకున్న చర్యల వివరాలు తెలపాలి.. అని రాజ్భవన్ కార్యాలయానికి దరఖాస్తు చేసినట్టు పేర్కొన్నారు. ఆయా దరఖాస్తులపై అధికారులు స్పందించకపోవడంతో మొదటి అప్పీలు కూడా చేశామని, అయినా స్పందన రాలేదని పేర్కొన్నారు. బాధ్యత కలిగిన కార్యాలయం నుంచి కూడా సమాచారం ఎందుకు ఇవ్వడం లేదో తెలుపాలని రాజేంద్ర పల్నాటి కోరారు.