VC Sajjanar | ఇటీవల ఫెడెక్స్ కొరియర్ పేరుతో చాలా మందికి కాల్స్ వస్తున్నాయి. ఆధార్ నెంబర్తో పార్సిల్ వచ్చిందని.. అందులో అక్రమంగా రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని భయాందోళనకు గురి చేస్తున్నారు. డ్రగ్స్ రవాణా కేసులో శిక్షలు కఠినంగా ఉంటాయని.. కేసుల నుంచి తప్పించుకునేందుకు రూ.లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎందరో సైబర్ నేరగాళ్ల బారినపడి లక్షల్లో సొత్తును నష్టపోయారు.
ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఫెడెక్స్ పార్సిల్స్ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్ని నమ్మొద్దని.. పోలీసులమని చెప్పగానే భయపడి డబ్బులు ఇవ్వొద్దని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానం వచ్చినా.. మోసపోయినా వెంటనే 1930 నంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
అయితే, సైబర్ నేరగాళ్ల బారినపడ్డ వారిలో ఎక్కువ మంది విద్యావంతులే ఉండడం ఆందోళనకరమన్నారు. సైబర్ నేరగాళ్లు మోసాలకు కొత్త కొత్త వాటిని ఎంచుకుంటున్నారన్నారు. ఇంతకు ముందు ఓటీపీ, ఓఎల్ఎక్స్, రెంట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారన్న ఆయన.. తాజాగా ఫెడెక్స్ పేరుతో మోసాలకు తెరలేపారని చెప్పారు. తాము పోలీస్స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని.. మీరు పంపిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజుతున్నారన్నారు.
ఎవరూ పార్సిల్స్ పంపనప్పుడు ఎందుకు భయందేనికని ప్రశ్నించారు. మోసాల బారినపడుతున్న వారిలో విద్యావంతులే ఎక్కువ ఉన్నారన్నారు. అవతలి వ్యక్తులు భయపడితే భయపెడతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే, పెట్టుబడులు పెడితే లక్షల్లో ఆదాయం వస్తుందని ఆశపడొద్దని సూచించారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టడం మంచిదని చెప్పారు.