ధర్పల్లి, డిసెంబర్ 29 : ఆర్టీసీ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొస్తానని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రానికి వచ్చిన ఆయన పాత బస్టాండ్ ప్రాంతంలో ఆగి ఉన్న బస్సును బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడారు.
సిబ్బంది ప్రవర్తన తీరు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు అవసరమున్నదో వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్, పర్సనల్ వాహనాలను వినియోగించకుండా ఆర్టీసీని సద్వినియోగం చేసుకుంటే తద్వారా ఖర్చు ఆదా అవుతుందని, వాహనాల రద్దీ, కాలుష్యం కూడా తగ్గుతుందని సూచించారు.
ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు, ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీల శ్రీరాములు తదితరులు ఉన్నారు.