హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతానికి నాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయి. కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా నాడు సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఆర్టీసీ ప్రగతి రథచక్రాలను లాభాల దిశగా పయనింపజేశాయి. కొవిడ్ తర్వాత మూడేండ్ల పాటు అమలు చేసిన ఆర్థిక క్రమశిక్షణ, వ్యయ నియంత్రణ, ఆదాయ వృద్ధి చర్యలు, ప్రభుత్వ మద్దతు, యాజమాన్య సంసరణలు కలిసి నేడు ఆర్టీసీ లాభాల బాట పట్టించడంలో కీలకమయ్యాయని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. ఖర్చుల నియంత్రణ, ఆక్యుపెన్సీ పెంపు, కొత్త ఆదాయ వనరులే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయని చెబుతున్నారు.
2020లో కరోనా లాక్డౌన్ కారణంగా నెలల తరబడి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో సంస్థ ఆదాయం కుప్పకూలింది. అయినా నాటి సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో కార్మికులు, ఉద్యోగుల వేతనాలు క్రమం తప్పకుండా చెల్లించారు. డీజిల్, రుణాల చెల్లింపులు, నిర్వహణ ఖర్చులు ఉన్నా సంస్థను కాపాడుకోవడం కోసం వెనుకడుగు వేయలేదు. ఫలితంగా 2020-21లో సంస్థకు రూ.2,329 కోట్ల నష్టం నమోదైంది. ఆ తర్వాతే సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల మధ్య సర్వీసులను దశలవారీగా పునరుద్ధరించారు. డిమాండ్కు అనుగుణంగా సర్వీసులను పెంచడం వల్ల ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది.
మరీ ముఖ్యంగా వ్యయ నియంత్రణపై నాటి సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిబ్బందికి ఇంధన పొదుపు శిక్షణ ఇప్పించారు. ఆక్యుపెన్సీ, ఇంధన పొదుపు చేసిన ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించారు. బస్సుల విడిభాగాల కొనుగోళ్లలో పారదర్శక విధానం తీసుకొచ్చారు. వర్షాప్ల సామర్థ్యాన్ని క్రమంగా పెంచే ఏర్పాట్లు చేశారు. పాత బస్సుల మరమ్మతుల ద్వారా వ్యయ నియంత్రణ క్రమంగా అదుపులోకి వచ్చింది. డిపోలు, బస్ స్టేషన్లలో ఉన్న వాణిజ్య స్థలాలను లీజుకు ఇవ్వడం, ప్రకటనల ద్వారా ఆదాయం పెంచడం, షాపింగ్ కాంప్లెక్స్ల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. పండుగల సమయంలో ప్రత్యేక బస్సులు నడిపారు. ఇలా సంస్థను లాభాల బాట పట్టించారు.
ఆర్టీసీలో సొంత బస్సుల నిర్వహణ ఖర్చు ఎకువగా ఉండటంతో, వాటిని కొంతమేర తగ్గించి, అద్దె బస్సులను ప్రోత్సహించింది. దీనివల్ల ఇంధన, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గి, ఆర్టీసీకి భారీగా ఖర్చు ఆదా అయ్యింది. ఒక్క ప్రయాణికుల టికెట్లపైనే ఆధారపడకుండా టోల్ చార్జీలు, సేఫ్టీ సెస్, రౌండప్ చార్జీలు వంటి వినూత్న రూపాల్లో మార్పులు చేసి సంస్థకు స్థిరమైన అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు అమలు చేశారు. ఇలాంటి ఎన్నో సంసరణల ఫలితంగా 2014-15 నుంచి వరుసగా నష్టాల్లో నడిచిన ఆర్టీసీ.. పదేండ్ల తర్వాత తొలిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,939.02 కోట్ల ఆదాయంతో రూ. 104.10 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ప్రస్తుత మహాలక్ష్మీ ఉచితబస్సు ప్రయాణం ఫలితంగా 2024-25లో సుమారు రూ.590 కోట్ల లాభం, 2025-26లో రూ.1,059 కోట్ల లాభం నమోదైనట్టు తాజా ఆర్థిక లెకలు సూచిస్తున్నాయి.
నామమాత్రంగా ఉన్న ఆన్లైన్ రిజర్వేషన్ వ్యవస్థను నాడు కేసీఆర్ ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. ఆ తర్వాత మొబైల్ యాప్ల ద్వారా టికెట్ బుకింగ్ను ప్రోత్సహించారు. నగదు రహిత చెల్లింపులు భారీగా పెరుగడంతో ఆదాయ లీకేజీ తగ్గిందని ఆర్టీసీ అధికారులు పేరొన్నారు. దీంతో పాటు ప్రభుత్వ బకాయిలు క్రమం తప్పకుండా విడుదల చేశారు. దీంతో సంస్థకు నగదు ప్రవాహం మెరుగుపడింది. అవసరమైన చోట ప్రభుత్వ ఆర్థిక సహకారం కూడా అందింది. దీనికి తోడు సంస్థను గట్టెకించేందుకు ఉద్యోగులు కూడా అహర్నిశలు కృషి చేశారు. కార్మిక సంఘాలు కూడా సహకరించాయి.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థకు ఆర్టీసీ పార్సిల్, కొరియర్, కార్గో సేవలతో కేసీఆర్ ఊపిరిపోశారు. 2020 జూన్ 19న అధికారికంగా కార్గో సేవలను ప్రారంభించారు. ప్రారంభ దశలో సుమారు 50 బస్సులను కార్గో కోసం వినియోగించి, తర్వాత దశలవారీగా సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. మొదట ఆరు నెలల్లోనే సుమారు 15 కోట్ల పార్సిల్ ఆదాయం.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్గో ద్వారా మరో రూ.4 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. వెరసి మొదటి సంవత్సరం రూ.46 కోట్లు సాధించారు. 2023-24 నాటికి ఆర్టీసీ సుమారు రూ.120 కోట్ల వరకూ ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి. అదనపు వాహనాలు కొనకుండా ఉన్న నెట్వర్ను ఉపయోగించుకోవడం వల్ల ఖర్చు తకువగా ఉండేది. టికెట్ ఆదాయం తగ్గిన రోజుల్లో కూడా కార్గో బుకింగ్లు కొనసాగడంతో సంస్థకు రోజువారీ క్యాష్ ఫ్లో మెరుగుపడింది. కరోనా సమయంలో ఇది కీలకంగా మారింది. కార్గో ప్రైవేట్ కొరియర్ సంస్థలకు పోటీగా నిలిచింది.
