హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని రివల్యుషనరీ సోషలిస్టు పార్టీ నాయకులు, కొల్లాం ఎంపీ ప్రేమచంద్రన్ అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్తో, ఆర్ఎస్పీ ఎంపీ ప్రేమచంద్రన్ హైదరాబాద్లోని హాయత్ హోటల్లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ స్థాయి రాజకీయాలపై, ఇతర పలు అంశాలపై వారు చర్చించారు. జాతీయ స్థాయిలో రాజకీయంగా బలమైన విపక్షం లేకుండా పోయిందని, దీంతో బీజేపీ ఆటలు సాగుతున్నాయని ప్రేమ చంద్రన్ అభిప్రాయ పడ్డారు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రేమ చంద్రన్ తన ఆసక్తిని వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలను, వివిధ రంగాల ప్రముఖులను ఒక తాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రేమ చంద్రన్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వినోద్ కుమార్తో పంచుకున్నారు. ప్రస్తుత జాతీయ రాజకీయాలలో కేసిఆర్ రాజకీయంగా బలమైన ప్రభావాన్ని చూపగలరని, ఆయన వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయని ఎంపీ ప్రేమ చంద్రన్ స్పష్టం చేశారు.
నాలుగు సార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవడమే కాకుండా కేరళ రాష్ట్రం జల వనరుల శాఖ మంత్రిగా విశేష అనుభవం ఉన్న ప్రేమ చంద్రన్ బెస్ట్ పార్లమెంటేరియన్గా, సంసద్ రత్న అవార్డు గ్రహీతగా హైదరాబాద్ రావడంతో ప్రేమ చంద్రన్ ఆహ్వానం మేరకు వినోద్ కుమార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంటులో సహచర ఎంపీగా ఉన్నప్పటి నుంచి ప్రేమ చంద్రన్ తో ఉన్న అనుబంధాన్ని వినోద్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎంపీ ప్రేమ చంద్రన్ తో బోయినపల్లి వినోద్ కుమార్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో ఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కే రేజీ కుమార్, వీ సునీల్ కూడా ఉన్నారు.