నిజామాబాద్: నిజామాబాద్ (Nizamabad) జిల్లా రుద్రూర్లో భారీ చోరీ జరిగింది. బస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను (SBI ATM) ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. రూ.25 లక్షలు దోచుకెళ్లారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బొలెరో వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు.. ముసుగులు ధరించి ఉన్న వారు తమ ఫుటేజ్ రికార్డు కాకుండా ఇరువైపులా ఉన్న సీసీ కెమెరాలపై స్ప్రే చేశారు.
అనంతరం ఏటీఎంను ధ్వంసం చేసి రూ.25 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మెషిన్ విడిభాగాలను బయట పడేశారు. సమాచారం అందుకున్న రుద్రూర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించారు. ఈ చోరీపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.