హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి దసరా తర్వాత అనుమతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో సంగారెడ్డి- నర్సాపూర్- తుప్రాన్- గజ్వేల్- ప్రజ్ఞాపూర్- యాదగిరిగుట్ట- చౌటుప్పల్ వరుకు 158 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) వేగంగా కసరత్తు చేస్తున్నది. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ, అలైన్మెంట్ పనులను నాగపూర్కు చెందిన కేఅండ్జే సంస్థకు అప్పగించింది. అలైన్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక రూపొందించి ఎన్హెచ్ఏఐకి పంపింది. అలైన్మెంట్ ఖరారైన తర్వాత రోడ్డు నిర్మాణానికి ఎంత భూమిని సేకరించాలన్న దానిపై కేఅండ్జే సంస్థ ఎన్హెచ్ఏఐకి నివేదిక అందజేస్తుంది. భూసేకరణకు ఆమోదం లభించాక పూర్తిస్థాయిలో డీపీఆర్ను రూపొందిస్తుంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానిస్తారు. గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్తో జరిగే రీజనర్ రింగ్ రోడ్డు నిర్మాణం తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనున్నది. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణలో 50% ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది.