జోగుళాoబ గద్వాల : తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నకిలీ విత్తనాలను, అనుమతి లేని నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ చౌక్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై, మాయమాటలు చెప్పి రైతులను మోసాగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారి పై నిఘా ఉంచడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీం, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మరో టాస్క్ ఫోర్స్ టీం ను ఏర్పాటు చేశామన్నారు.
వ్యాపారులు స్టాకు లైసెన్సు బిల్ బుక్కులు తదితర వివరాలు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాపారులు రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో అన్ని వివరాలతో కూడిన రసీదులు తప్పకుండా ఇవ్వాలని అత్యాశకు పోయి నకిలీ విత్తనాలు విక్రయించి జైలుపాలు కావొద్దని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి గుర్తింపు లేని ఆర్గనైజర్ నుంచి ఎలాంటి కంపెనీ సర్టిఫైడ్ లేని విత్తనాలను రైతులు కొనొద్దన్నారు. రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండి, ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని కంపెనీ సర్టిఫైడ్ పొందిన విత్తనాలను సర్టిఫైడ్ పొందిన ఆర్గనైజర్ దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలన్నారు.
సీడ్ పత్తి సాగు చేయాలనుకునే రైతులు కంపెనీ సర్టిఫైడ్ పొందిన సీడ్ ఆర్గనైజర్ వద్దనే సీడ్స్ తీసుకోవాలి., సీడ్స్ ను రైతులు తీసుకున్నప్పుడు ఆర్గనైజర్ నుంచి రశీదు పొందాలన్నారు.
జిల్లా లో ఎవరైనా ఆర్గనైజర్లమంటూ నకిలీ సీడ్స్ ను అమ్ముతున్నట్లు, సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టి కి వచ్చిన రైతులు సంబంధిత పోలీస్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకరావాలి.
లేదా డయల్ 100 పోలీస్ కంట్రోల్ రూమ్ నెం -9494921100 కు సమాచారం అందించిన వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.