హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పాడైపోయిన రోడ్లు మళ్లీ అద్దంలా మెరవనున్నాయి. ఈ నెల 10 నుంచి వీటి మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులకు దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని రోడ్లు, భవనాల శాఖ ప్రాథమికంగా అంచనాలు రూపొందించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇటీవల నిధులు మంజూరు చేయడంతో రోడ్లకు రూ.1,823.40 కోట్లు, కల్వర్టులకు రూ.544. 40 కోట్లు కలిపి మొత్తం రూ.2,367.80 కోట్ల పనులకు టెండర్లు చేపట్టారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరిందని, జిల్లాలవారీగా ప్రాధాన్య క్రమంలో మరమ్మతులు చేపట్టి 2 నెలల్లో పనులన్నీ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఓ అధికారి వెల్లడించారు.