హైదరాబాద్ : నదుల అనుసంధానం దేశానికి విపత్తు అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ స్పష్టం చేశారు. నదుల అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తేల్చిచెప్పారు. నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రాల మధ్య తగాదాలు వస్తాయన్నారు. మిగులు జలాలు ఉన్నాయని ఏ రాష్ట్రం అంగీకరించలేదు అని ఆయన పేర్కొన్నారు. అనుసంధానమంటే నీటిని ప్రయివేటు, వాణిజ్యపరం చేయడమే అని చెప్పారు. నదుల అనుసంధానం అవినీతికి ఆజ్యం పోస్తుందని మండిపడ్డారు. అనుసంధానించాల్సింది నదులను కాదు.. నదులతో మనషుల మేథస్సు, హృదయాన్ని అని రాజేందర్ సింగ్ సూచించారు. కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపడితే గాంధీజీ మార్గంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలోని జలసౌధలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్ సింగ్ ప్రసంగించారు.
నీటి పారుదల విషయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ సీఎం కేసీఆర్ను చూసి నేర్చుకోవాలి అని రాజేందర్ సింగ్ సూచించారు. సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అన్ని రాష్ట్రాలు అనుసరించాలన్నారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు వాటర్ యూనివర్సిటీ నెలకొల్పాలి. వ్యవసాయానికి, ఇతర రంగాలకు క్రమం తప్పకుండా నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని రాజేందర్ సింగ్ పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో పైపుల ద్వారా మంచినీటి సరఫరా చేయడం హర్షణీయం. తెలంగాణలో ఎక్కడా ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు అందించే పరిస్థితి లేదు అని ఆయన స్పష్టం చేశారు.
రివర్ లిటరసీ మూవ్మెంట్ను త్వరలోనే ప్రారంభం చేస్తున్నామని, ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలి అని రాజేందర్ సింగ్ పిలుపునిచ్చారు. నీటికి సంబంధించి దేశ ప్రజలకు కావాల్సిన మ్యానిఫెస్టోను జాతీయ సదస్సులో విడుదల చేస్తాం అని చెప్పారు. సుప్రీంకోర్టు సూచనలతో 1992లో 25 వేల మైనింగ్ కంపెనీలు మూసివేశారు. తరువాత భూగర్భ జలాలు ఉబికి వచ్చి నీటి సమస్య పరిష్కారం అయిందని రాజేందర్ సింగ్ గుర్తు చేశారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చాలా బాగుంది. సర్వాంగ సుందరంగా దేవాలయాన్ని తీర్చిదిద్దారు అని రాజేందర్ సింగ్ కొనియాడారు. మూడు చెరువుల నుంచి దేవాలయానికి నీరు సరఫరా చేస్తున్నారు. ప్రకృతిని ప్రేమిస్తే మనుషులకు బలమైన శక్తి సిద్ధిస్తుంది. సీఎం కేసీఆర్ను చూసి దేశం నేర్చుకోవాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. దేశానికి సీఎం కేసీఆర్ రోల్ మెడల్ అని రాజేందర్ సింగ్ చెప్పారు.