హనుమకొండ, జూలై 16: కేంద్రం నిర్లక్ష్యం, మొండివైఖరి కారణంగా తెలంగాణలో 40 రోజులుగా రైస్మిల్లులు తెరుచుకోవడం లేదని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి పాడి గణపతిరెడ్డి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవునూరి అంజయ్య మండిపడ్డారు. శనివారం హనుమకొండలోని రైల్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రైస్ ఇండస్ట్రీ సంక్షోభంలో పడిపోయే ప్రమాదం ఉన్నదని ధ్వజమెత్తారు. హనుమకొండ జిల్లాలో 2021-22 వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి మొత్తం 2.50 లక్షల టన్నులు, వరంగల్ జిల్లాలో దాదాపు 4 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లో పేరుకుపోయిందని తెలిపారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకొన్న మిల్లర్లు జాగా లేకున్నా మిల్లు ఆవరణలో దిగుమతి చేసుకొని ప్రభుత్వానికి సహకరించినట్టు తెలిపారు.
గత నెల 7 నుంచి ఎఫ్సీఐ సీఎంఆర్ బియ్యం తీసుకోకపోవడంతో మిల్లులు మూతపడ్డాయన్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మిల్లుల ఆవరణలో ఉన్న ధాన్యం తడిసి, మొలకలెత్తడంతో మిల్లర్లు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. 40 ఏండ్ల రైస్ ఇండస్ట్రీ చరిత్రలో ఇంతటి దుస్థితిని చూడలేదన్నారు. కేంద్రం వెంటనే స్పందించి రా రైస్, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన, ముక్కిపోయిన, మురిగిపోయిన ధాన్యం మిల్లింగ్ చేయించి ఎలా ఉన్నా కొనుగోలు చేయాలని కోరారు.
ఒకవేళ సీఎంఆర్ తీసుకోకపోతే వెంటనే ధాన్యాన్ని ప్రభుత్వ గోదాములకు తరలించాలని వారు సూచించారు. నష్టపోయిన మిల్లర్లకు 25శాతం చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్పందించక పోతే రైతుల మాదిరిగా రైస్మిల్లర్లు సైతం ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని మిలర్ల అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బెల్దె కిషన్, తక్కళ్లపల్లి యుగేంధర్, మల్లేశం, వెంకటేశ్వర్రావు, సత్యనారాయణ, ఇరుకుళ్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.