న్యూఢిల్లీ: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ పర్యటన( Delhi )బిజీబిజీగా కొనసాగుతున్నది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్ర నేత రాహుల్గాంధీ, పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీలతో ఆయన సమావేశమయ్యారు.
తనను సీఎల్పీ నేతగా ప్రకటించిన నేపథ్యంలో వారికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రేపు (గురువారం) హైదరాబాద్లో జరగబోయే తన ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించారు. అదేవిధంగా రాష్ట్రంలో మంత్రివర్గం కూర్పు, ఇతర అంశాలపై కూడా రేవంత్రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో చర్చించారు.
అయితే హస్థినలో అన్ని లాంఛనాలను ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. ఇంతలోనే రేవంత్రెడ్డికి హైకమాండ్ ఫోన్ చేసి వెంటనే ఏఐసీసీ( AICC office) కార్యాలయానికి రావాలని చెప్పడంతో హుటాహుటిన తిరుగు ప్రయాణమయ్యాడు. మహారాష్ట్ర సదన్కు చేరుకొని మాణిక్రావు ఠాక్రేతో సమావేశమయ్యారు. కాగా, గురువారం రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ మేరకు రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.