Telangana | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డితోపాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వారితో ప్రమాణం చేయించనున్నారు. కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిసి సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డిని ఎన్నుకున్నట్టు 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. గురువారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని గవర్నర్కు తెలియజేశారు.
ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారానికి దేశంలోని పలువురు కీలక రాజకీయ నేతలు తరలిరానున్నారు. ఇప్పటికే వారందరికీ రేవంత్రెడ్డి నుంచి, పీసీసీ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఏఐసీసీ నేతలు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అధిష్ఠానం పిలుపు మేరకు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన రేవంత్రెడ్డి బుధవారం ఉదయం ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీని కలిసి తనను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరితోపాటు పలువురు జాతీయ, ఆయా రాష్ర్టాల కీలక నేతలకు ఆహ్వానం పంపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, బీహార్ సీఎం నితీశ్కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తోపాటు అన్ని రాష్ర్టాల పీసీసీ అధ్యక్షులకు ఆహ్వానం అందించారు. ఏఐసీసీ నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తోపాటు మరికొందరు కీలక నేతలు రానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపించిన రేవంత్రెడ్డి.. ప్రజలను కూడా రావాల్సిందిగా కోరారు.
ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై డీజీపీ రవిగుప్తా తదితర అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎస్ శాంతికుమారి.. అనంతరం ఎల్బీ స్టేడియానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు నగరంలో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆ ప్రాం తంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. వాహనదారులు అటువైపు రావొద్దని సూచించారు.
ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం దివ్యాంగురాలైన రజినీకి తొలి ఉద్యోగం కల్పిస్తూ ఫైలుపై రేవంత్రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా రజినీకి ఆహ్వానం అందించారు. అక్టోబర్ 17న గాంధీభవన్లో రేవంత్రెడ్డిని కలిసిన రజినీ తన ఇబ్బందులను తెలియజేశారు. దివ్యాంగురాలైన తనకు ఎక్కడా ఉద్యోగం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమెకు గ్యారంటీ కార్డు అందించిన రేవంత్రెడ్డి.. తమ ప్రభుత్వం రాగానే తొలి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే గురువారం ఆమెకు ఉద్యోగం ఇవ్వనున్నారు.